ముప్పదిమూడుపున్నముల నోము కథ
ఒక బ్రాహ్మణునకు ఒక కుమార్తె కలదు. అతడు ఆమెకు పెండ్లి చేసెను. పెండ్లి అయిన మూడవనాడు ఆ బాలిక తన స్నేహితురాలింటికి పేరంటమునకు వెళ్లెను. అంతలో ఆమె భర్త మరణించెను. ఆమె పేరంటమునుండి తిరిగివచ్చుత్రోవలో ఆవూరి రాజుగారి దివాణము ఉండెను. రాజుగారి భార్య మేడమీద నిలిచి త్రోవనుపోవుచున్న బాలికనుచూచి ” అమ్మాయీ! నేను ముప్పదిమూడు పున్నములనోము నోచుకున్నాను. వాయనము ఇస్తాను, పుచ్చుకుంటావా ? ” అను అడిగెను. అందుకాచిన్నది ఒప్పుకొని వాయనముపుచ్చుకుని ఇంటికి వచ్చినది. అంతకుముందే మరణించియున్న ఆమె భర్త నిద్రమేల్కొనినవానివలె బ్రతికిలేచెను. అప్పుడు అతని దహనకార్యమునకు వచ్చిన బంధువులు అదిచూచి ఆశ్చర్యపోయిరి. “ఎంత అదృష్టవంతురాలివమ్మా! ఏమి నోము నోచితివో గాని చచ్చిన మగడు బ్రతికాడు. ” అని అన్నారు. ఆమె తాను నోమును నోచలేదని, రాణి ముప్పదిమూడు పున్నముల నోము నోచుకుని ఆ వాయనము తనకు ఇచ్చెనని, ఇది అంతా వాయనమును అందుకొన్నందువలన కలిగిన ఫలితము అని తెలిపెను. అంతలో ఆమె భర్త ప్రాణము తీసుకొనిపోవుటకు వచ్చిన యమభటులు యమునివద్దకువెళ్ళి ” స్వామీ ! మీరు చెప్పినట్లుగా వెళ్ళి ఆ బ్రాహ్మణయువకుని ప్రాణములను తీసుకొని వచ్చునంతలో అతనిభార్య వెలుగుతున్న జ్యోతులతోఉన్న వాయనమును పట్టుకుని వచ్చెను. అది చూచి అతని ప్రాణములు మావద్దనుండి వెళ్ళి అతని శరీరంలో చేరినవి. వాటిని తెచ్చుట మాకు సాధ్యముకాలేదు. ఆపనిచేయుటకు మీరే సమర్థులు. ” అని మనవిచేశారు. యముడే స్వయముగా బయలుదేరివచ్చి అతనిప్రాణములు తీసుకొని వెళ్ళుచున్నాడు. వాయనమును తీసుకున్న మహాత్మ్యము వలన ఆ బ్రాహ్మణయువతి యముని వెంటపడినది. కొంతదూరం వెళ్ళినతరువాత యముడు “అమ్మ! ఎందుకు నావెంట వస్తున్నావు ? ” అని అడిగెను. అందుకాచిన్నది ” ధర్మరాజా! నేను నా భర్త కొరకు వస్తున్నాను” అన్నది. “నీభర్త ప్రాణములను తప్ప మరేదయినా వరము కోరుకొనుము, ఇచ్చెదను” అన్నాడు. అదివిని ఆమె ” తను ముప్పయిమూడు అట్లు వాయనము తెచ్చుకున్నందున ఆ అట్లకు ఎన్ని చిల్లులున్నాయో అన్ని ఏండ్లు తనకు అయిదవతనమును ఇవ్వమని” కోరినది. “అట్లాగే” అనిచెప్పి వెళ్ళిపోతున్నాడు యముడు. ఆమె అతనిని ఇంకను వెంబడిస్తున్నది. కొంతదూరము వెళ్ళినాక చూచి ” మరల నీవు వస్తున్నావెందుకు” అని అడిగాడు యముడు. ఆమె ” తన భర్త కొరకు వస్తున్నాను” అన్నది. అందుకని అతడు “తన భర్తప్రాణములను తప్ప మరేమైనా కోరుకోమన్నాడు” యముడు. ఆమె “స్వామీ! నాతో ముప్పదిమూడు నల్లపూసల జోళ్ళు తెచ్చుకున్నాను. వాటికి ఎన్ని చిల్లులున్న వో అన్ని వేల ఏండ్లు ఐదవతనమును ఇమ్మని ప్రార్థిస్తున్నాను” అన్నది. అది విన్న యముడు మిక్కిలి సంతోషించి ఆమె భర్త ప్రాణములను ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆమె సంతోషముతో ఇంటికి వెళ్ళు లోపల ఆమె భర్త సజీవుడై ఉండెను. ఆ వింత చూచి అందరూ ఆశ్చర్యపడి “ఏమి నోము నోచుకున్నావమ్మా?” అని అడిగిరి. దానికి ఆమె ” ఇదంతా వాయనము తీసుకొన్నందుకు వచ్చిన ఫలము” అని చెప్పినది. నోము వాయనముకే ఇంత ఫలితముంటే నోము నోవ్చుకున్న ఇంకెంతఫలమో అని అందరూ ఆ నోమునోచుకున్నారు. ముప్పదిమూడు పూర్ణిమలు ఉపవాసము ఉన్నతరువాత వచ్చిన పూర్ణిమనాడు ఉద్యాపనము చేసుకొని సుఖముగా ఉండిరి.
Muppaimudu Purnimala nomu katha / 33 / thirty three
For related posts, click on -> నోములు, వ్రతాలు – Nomulu & Vratalu