శంకరస్తోత్రాలు : సౌందర్యలహరి 1
(శ్లోకం, తాత్పర్యం, పరమాచార్యుల వ్యాఖ్యాసంగ్రహంతో)
శ్రీ మహాగణాధిపతయే నమః
శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం
న చేదేవం దేవో న ఖలు కుశలః స్పన్దితుమపి ।
అతస్త్వామారాధ్యాం హరిహరవిరిఞ్చాదిభిరపి
ప్రణన్తుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి ॥ 1॥
అమ్మా! శివుడు శక్తితో (నీతో) కూడినప్పుడు జగన్నిర్మాణము చేయగలుగుతున్నాడు. కానిచో స్పందించుటకు కూడా అసమర్థుడు కదా. బ్రహ్మ విష్ణు మహేశ్వరాదుల చేత ఆరాధించబడు నీకు, పుణ్యసంపదలేనివాడు నమస్కరించుట, స్తుతించుట ఎలా చేయగలడు ?
ఈ సృష్టిలోని ప్రతీ కదలికకూ అమ్మవారి శక్తి కారణమనీ, ఆమెకు నమస్కరించాలన్నా, స్తుతిచేయాలన్నా అమ్మ అనుగ్రహం ఉండాలనీ, ఆ అనుగ్రహం గతజన్మలపుణ్యఫలమనీ శంకరులు అంటున్నారు.
ఈ ప్రపంచమునకు పరమేశ్వరుని స్పందన ద్వారా కారణమవుతున్నది అమ్మవారు. జీవుడు ఈ మాయా ప్రపంచమునుండి విడివడి శివైక్యం చెందుటకుకూడా అమ్మవారే కారకురాలు. అట్టి శివైక్యం చెందుటకు అమ్మ కటాక్షంకోసం ప్రార్థించాలి. ఇది శంకరులు ఈ శ్లోకంలో అంతర్లీనంగా మనకు చేసిన ఉపదేశం.
Soundaryalahari 1 (with Paramacharya Vyakhyasangraha)