శివానందలహరీ 21-30

శివానందలహరీ (21-30)

శ్రీ శివాభ్యాం నమః

ధృతిస్తంభాధారాం దృఢగుణనిబద్ధాం సగమనాం 
విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివససన్మార్గఘటితాం |
స్మరారే మచ్చేతః స్పుటపటకుటీం ప్రాప్య విశదాం 
జయ స్వామిన్ శక్త్యా సహ శివగణైస్సేవిత విభో || 21 ||

ప్రభూ, మన్మథసంహారీ, సర్వవ్యాపకా, శివగణములచే సేవించబడువాడా, నా వద్ద నీవు నివసించుటకు ఒక కుటీరము ఉన్నది. అది ధైర్యమనెడి స్తంభము ఆధారముగా, సద్గుణములనే తాళ్ళతో గట్టిగా కట్టబడి ఉన్నది. ఆ కుటీరము విచిత్రముగా పద్మాకారములో నున్నది. దానిలో అటునిటు తిరుగవచ్చు (విశాలమైనది). అది నిర్మలమూ, అనుదినము సన్మార్గవర్తీ అయిన నా హృదయమనే కుటీరము. నీవు అమ్మతో సహా ఈ నా హృదయకుటీరములో ప్రవేశించి నివసింపుము.

(శంకరులు సద్భక్తుల నడత ఎలా ఉండాలో చూపుతున్నారు)

ప్రలోభాద్యైరర్థాహరణపరతంత్రో ధనిగృహే
ప్రవేశోద్యుక్తః సన్ భ్రమతి బహుధా తస్కరపతే |
ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకర విభో
తవాధీనం కృత్వా మయి నిరపరాధే కురు కృపామ్ || 22 ||


దొంగలరాజగు ఓ ప్రభూ! శంకరా! నామనస్సనే దొంగ ప్రలోభముతో ధనమునపహరించుటకై ధనికుని ఇంటిలో ప్రవేశించుటకు ప్రయత్నించుచూ తిరుగుచున్నది. దీనిని నేనెట్లు సహించగలను? (నా మనస్సేమో దొంగ, నువ్వేమో దొంగలరాజువి, దొంగలంతా ఒక్క జట్టు కదా) నా మనస్సుని నీ అధీనంలో ఉంచుకొని నిరపరాధియైన నా పై కరుణచూపుము.

కరోమి త్వత్పూజాం సపది సుఖదో మే భవ విభో 
విధిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యాః ఫలమితి |
పునశ్చ త్వాం ద్రష్టుం దివి భువి వహన్ పక్షిమృగతా
మదృష్ట్వా తత్ఖేదం కథమిహ సహే శంకర విభో || 23 ||


శంకరా, మహాదేవా, నేను నీ పూజలు చేస్తాను. వెంటనే నాకు మోక్షమునిమ్ము. అలాకాకుండా పూజకు ఫలముగా నన్ను బ్రహ్మగానో, విష్ణువుగానో చేశావే అనుకో, మళ్ళీ నిన్ను చూడడం కోసం హంసగా ఆకాశంలోనూ, వరాహముగా భూమిలోనూ వెతుకుచూ, ప్రభూ, నీవు కనపడక, ఆ భాధను నేనెలా భరించగలను ?

కదా వా కైలాసే కనకమణిసౌధే సహగణై-
ర్వసన్ శంభోరగ్రే స్ఫుటఘటితమూర్థాంజలిపుటః
విభో సాంబ స్వామిన్ పరమశివ పాహీతి నిగదన్
విధాతౄణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతః॥24॥

ఓ దేవా! కైలాసము నందు బంగారముతోనూ మరియు మణులతోనూ నిర్మించిన సౌధంలో ప్రమథగణాలతో కలసి నీ ఎదురుగా నిలబడి,తలపై అంజలి మొక్కుచూ ” ఓ ప్రభూ! సాంబా! స్వామీ! పరమశివా! రక్షించు” అని పలుకుచూ అనేక బ్రహ్మాయుర్దాయములను క్షణమువలే సుఖంగా ఎప్పుడు గడిపెదనో కదా!

స్తవైర్బ్రహ్మాదీనాం జయజయవచోభిర్నియమినాం
గణానాం కేలీభిర్మదకలమహోక్షస్య కకుది ।
స్థితం నీలగ్రీవం త్రినయనముమాశ్లిష్టవపుషం
కదా త్వాం పశ్యేయం కరధృతమృగం ఖణ్డపరశుమ్ ॥ 25 ॥

బ్రహ్మాది దేవతలు స్తుతించుచుండగా, మహర్షులు జయ జయ ధ్వానములు పలుకుచుండగా, ప్రమథగణములు ఆడుచుండగా, చేతులలో లేడినీ, ఖండపరశువునూ ధరించి, ఉమాదేవి ఆలింగనము చేసికొని యుండగా, మదించిన నంది మూపురముపై కూర్చుని ఉన్న నీలకంఠుడవూ, త్రినేత్రుడవూ అయిన నిన్ను ఎపుడు చూతునో కదా!

కదా వా త్వాం దృష్ట్వా గిరిశ తవ భవ్యాఙ్ఘ్రియుగళం
గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ ।
సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుటజలజగన్ధాన్ పరిమళాన్
అలభ్యాం బ్రహ్మాద్యైర్ముదమనుభవిష్యామి హృదయే ॥ 26 ॥

ఓ గిరిశ! నిన్ను చూచి, నీ దివ్యమంగళకరములైన పాదపద్మములను నా చేతులలోకి తీసుకొని, శిరమున ధరించి, కళ్ళకద్దుకొని, వక్షస్థలముపై ఉంచుకొని, కావలించుకొని, వికసితపద్మములనుబోలు పరిమళములను ఆఘ్రాణించుచూ, బ్రహ్మాదులకైనా లభించని ఆనందమును హృదయములో ఎప్పుడు అనుభవింతునో కదా!

కరస్థే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధనపతౌ
గృహస్థే స్వర్భూజాఽమరసురభిచిన్తామణిగణే ।
శిరస్థే శీతాంశౌ చరణయుగలస్థేఽఖిలశుభే
కమర్థం దాస్యేఽహం భవతు భవదర్థం మమ మనః ॥ 27 ॥

ఓ గిరిశా! బంగారు కొండ నీ చేతిలో ఉంది (మేరుపర్వతము త్రిపురాసురసంహారములో శివునికి విల్లయినది). నీ సమీపమునందే ధనాధిపతి కుబేరుడున్నాడు. నీ ఇంటియందే కల్పవృక్షము, కామధేనువు, చింతామణి ఉన్నాయి. నీ శిరస్సునందు చంద్రుడు ఉన్నాడు. సమస్తశుభములూ నీ పాదయుగళముయందు ఉన్నాయి. నేను నీకు ఏమి ఈయగలను ? నా మనస్సే నీదగుగాక.

సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే
సామీప్యం శివభక్తిధుర్యజనతాసాంగత్యసంభాషణే ।
సాలోక్యం చ చరాచరాత్మకతనుధ్యానే భవానీపతే
సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోఽస్మ్యహమ్ ॥ 28 ॥

ఓ సాంబశివా, భవానీపతే, నిను పూజించునప్పుడు నాకు సారూప్యమోక్షము (శివునితో సమమైన రూపముగల ముక్తి), శివా, మహాదేవా అని సంకీర్తన చేయునప్పుడు నాకు సామీప్యమోక్షమూ (ఎల్లపుడు శివుని చెంతన ఉండగల ముక్తి), గొప్ప శివభక్తిపరుల సాంగత్యములోనూ, వారితో సంభాషణలతోనూ సాలోక్యమోక్షమూ (శివలోకప్రాప్తి అను ముక్తి), చరచరాత్మకమైన నీ ఆకారమును ధ్యానించునప్పుడు సాయుజ్యమోక్షమూ (శివైక్యం అను ముక్తి), నాకు సిద్ధించినది. ఓ స్వామీ నేను కృతార్థుడను.

(ఈ నాల్గువిధముల మోక్షములూ సాధారణముగా దేహానంతరము లభించును. కానీ శివభక్తిపరులకు ఈ లోకమునందే సిద్ధించునని ఆచార్యులు చెప్పుచున్నారు)

త్వత్పాదామ్బుజమర్చయామి పరమం త్వాం చిన్తయామ్యన్వహం
త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో ।
వీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం
శంభో లోకగురో మదీయమనసః సౌఖ్యోపదేశం కురు ॥ 29 ॥

ఓ ప్రభూ, నీ పాదపద్మములను పూజించుచున్నాను. ప్రతిరోజూ పరమాత్ముడవైన నిన్నే ధ్యానించుచున్నాను. ఈశ్వరుడవైన నిన్నే శరణుజొచ్చుచున్నాను. వాక్కుద్వారా నిన్నే యాచించుచున్నాను. శంభో! దేవతలు కూడా చిరకాలంగా ప్రార్థించు నీ కరుణారసదృష్టి నాపై ఉంచవయ్యా. ఓ లోకగురూ! నా మనస్సుకు ఆనందదాయకమైన ఉపదేశం చెయ్యి.

వస్త్రోద్ధూతవిధౌ సహస్రకరతా పుష్పార్చనే విష్ణుతా
గన్ధే గన్ధవహాత్మతాఽన్నపచనే బర్హిర్ముఖాధ్యక్షతా ।
పాత్రే కాఞ్చనగర్భతాస్తి మయి చేద్ బాలేన్దుచూడామణే
శుశ్రూషాం కరవాణి తే పశుపతే స్వామిన్ త్రిలోకీగురో ॥ 30 ॥

ఓ చంద్రశేఖరా! ఓ పశుపతీ! సర్వవ్యాపకా! నీకు వస్త్రోపచారము చేయుటకు సూర్యుని వలే వేయిచేతులుండవలెను, నీకు పుష్పోపచారము చేయవలెనన్న విష్ణువు వలే సర్వవ్యాపకుడై ఉండవలెను, నీకు గంధోపచారము చేయుటయందు వాయుదేవుని వలే గంధవాహుడై ఉండవలెను, వంట చేసి నీకు హవిస్సు సమర్పించుటకు అగ్ని ముఖాధ్యక్షుడై ఉండవలెను, నీకు అర్ఘ్యపాత్రము సమర్పించుట కొరకు బ్రహ్మ వలే ఆగర్భశ్రీమంతుడై ఉండవలెను. వీరిలో ఏ ఒక్కరినీ నేను కానపుడు నీకు ఉపచారము చేయుట నా తరమా స్వామీ!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s