పువ్వులతాంబూలము నోము కథ
ఒక రాజు భార్య యందు ప్రేమ లేక సానికొంపలనుబట్టి యుండెను. అందుచే అతని భార్య దుఃఖించుచు , పార్వతి పూజలను చేయుచుండెను . ఒక నాడు ఆమె కలలో పార్వతీ దేవి కనిపించి “అమ్మా ! నీవు పూర్వము తాంబూల దానము చేయకపోవుటచే నీకీ జన్మలో నోటిదుర్వాసన వచ్చినది. అది భరింపలేక నీ భర్త వేశ్యాగృహములకు పోవుచున్నాడు. కావున నీవు నిత్య తాంబూల దానము చేసితాంబూలము సేవింపుము. అట్లు ఏడాదయిన తర్వాత ఉద్యాపనము చేసుకొనుము. నీకష్టములు గట్టెకును “అని చెప్పెను . తెల్లవారిన తరువాత ఆమె నోము నోచుకొని ప్రతి దినము ఒక తాంబూలములో ఐదుపువ్వులు పెట్టి ముత్తయిదువునకిచ్చి తానును తాంబూలము వేసుకొని సంవత్సరం నిండినంతనే ఉద్యాపనము చేసుకొని , భర్త అనురాగములను పొంది ఆనందముగా ఉండెను .
ఉద్యాపన :
ఒక బంగారు పువ్వును పళ్ళెములో పెట్టి ఆ పళ్ళెము నిండుగా నీరు పోసి చీర , రవికెలగుడ్డ పెట్టి పేరంటాలునకు పార్వతీదేవి పేరున వాయనము ఇవ్వవలెను.