కైలాసగౌరి నోము కథ
ఒక రాజుకు ఒక్కతే కుమార్తె కలదు. అతడు ఆమకు ఒక వన్నెల విసనకఱ్ఱ వంటి వయారి మగనిని ఏరి తెచ్చి పెండ్లి చేసెను. కాని ఆమె భర్త ఎల్లప్పుడూ వేశ్యాలోలుడై భార్య ముఖమైననూ చూడకుండెను. అందుకే ఆ రాచ చిన్నది మిక్కిలి బాధపడి పార్వతీదేవిని ప్రతిదినమూ పూజించుచూ , అతనిని తనతో కలపమని ప్రార్థించుచుండెను. అట్లు కొంతకాలము జరిగిన తరువాత పార్వతీదేవి ఆమెయందు కరుణించి ఒక నాటి రాత్రి ఆమె స్వప్నములో కనబడి కైలాసగౌరి నోము నోచినచో భర్తతో ఎడబాటు లేకుండునని తెలిపెను. తెల్లవారిన తరువాత ఆమె గత రాత్రి స్వప్న వృత్తాంతమును తన తండ్రికి తెలిపి ఆనోమును నోచుకొనెను. తరువాత ఆమె భర్త ఆమె యందు అనురాగము కలవాడై వేశ్యానుబంధమును వదులుకొనెను. అప్పటినుండీ వారిరువురూ పార్వతీపరమేశ్వరులవలే జంట విడువక సుఖముగానుండిరి.
ఉద్యాపన:
పండుగ దినమున పార్వతీ దేవాలయము నందు లేక నదీతీరమునందు ఐదు కుంచముల కుంకుమ , ఐదు కుంచముల పసుపు , పండ్లు ముత్తైదువులకు పంచిపెట్టవలెను. పంచిపెట్టునపుడు మాట్లాడరాదు.